
కూతురై పుట్టాక ఒక అయ్య చేతిలో పెట్టాలి అన్నట్లుగా చెయ్యలేదా తండ్రి.
కానీ..శాంతి చచ్చిపోయింది.
పెళ్లయ్యి ఏడాదైనా గడవక ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది.
మొగుడు తాగుబోతు కాదు, తిరుగుబోతూ కాదు.అందరూ అనుకునేట్లు సూర్యకాంతం లాంటి అత్త, నర్రా వెంకటేశ్వర్రావు లాంటి మామగారు కూడా లేరు. అందరికీ తెలిసినంతవరకు కోడల్ని నెత్తిన పెట్టుకుని చూసుకునేవారే.కట్నకానుకల బాధలు లేవు, ఆడపడుచుల అఘాయిత్యాలూ లేవు.
శాంతి చావుకు గల కారణాలను వెదుకుతూనే ఉన్నారు - రంధ్రాణ్వేషకులు.
నాలో తప్పు చేసానేమోనన్న అపరాధ భావం.ఇది నిజం కాకపోయి ఉంటే బాగుండునన్న ఆశ.ఎందుకంటే - వీళ్లెవరికీ తెలియంది నాకు తెలుసు కాబట్టి.నేను సరైన చర్యలు తీసుకున్నట్లయితే ఈ రోజు శాంతి చనిపోయి ఉండేది కాదు కాబట్టి.

రెండు నెలల క్రితమే నేను శాంతిని కలిసి ధైర్యం చెప్పి ఉంటే..పరిస్థితి మరోలా ఉండేదేమో?
మేము తరచూ ఉత్తరాలు వ్రాసుకునేవాళ్లం.మొబైల్ ఫోన్లు, ఇ-మెయిల్ల స్పీడు యుగంలో ఈ పాత చింతకాయ అలవాటేంటి అని ముక్కున వేలేసుకునేవారు, అడపాదడపా వెక్కిరించేవారు ఉన్నప్పటికీ మేము మా అలవాటును మానుకోలేదు. తను వ్రాసిన ఉత్తరాలు ఇప్పటికీ నా బీరువాలో భద్రంగా ఉన్నాయి.
తలుపులు బిగించుకుని ఉత్తరాలను ముందేసుకున్నాను.మొదటి ఉత్తరం.. షరా మామూలే.. శ్రీవారి ముచ్చట్లతో నింపేసింది.రెండవ ఉత్తరం.. ఏడాది క్రితం మామగారు కొని ఆశలొదిలేసుకున్న షేర్ల ధర అమాంతం పెరిగిపోయిందట. అంతా నీ చలవేనమ్మాయ్ అంటూ అందరూ ఆకాశానికెత్తేస్తున్నారట. చాలా ఆనందంగా సాగిపోయింది ఉత్తరం.మూడు, నాలుగు ఉత్తరాల్లోనూ ఇదే వరుస.. శ్రీవారికి ప్రమోషన్, అత్తగారి ఆస్మా రోగం కుదుటపడటం వగైరా వగైరా..
వీటన్నింటికీ కారణం ఈ అమ్మాయి పాద మహిమే గానీ మరొకటి కాదని అత్తవారింటి అభిప్రాయం.
అలాంటిదేమీ లేదండి, అంతా కాలమహిమ అంటుంది ఈ అమ్మాయి. వింటేగా? నెత్తినెట్టుకున్నారు, గారాలు పోయారు.
సాక్షాత్తూ ఐశ్వర్యారాయ్ లిఫ్ట్ అడిగినా సెకనైనా ప్రయాణం ఆపని కాలం మాత్రం శరవేగంతో దూసుకెళ్తూనే ఉంది.
పరిస్థితులు తారుమారయ్యాయి..ఎవరూ, ఎప్పటికీ ఖచ్చితంగా అంచనా వేయలేని షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలవడంతో మావగారికి నష్టాలొచ్చాయి.చలికాలంలో సరైనా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అత్తగారికి కొత్త రోగాలు పుట్టుకొచ్చాయి.కొత్త పెళ్లాం మోజుతో పనిపై సరిగ్గా శ్రద్ధ వహించని శ్రీవారికి మెమో.
ఎవరు మాత్రం ఒప్పుకుంటారు తప్పుని ఎత్తి చూపితే?నెత్తిన బరువు దించేసుకునేందుకు, జరిగిన విపరీతాలన్నింటికీ మరొకరే కారణమని నింద వేసేస్తే?
అదే జరిగింది..
మాబంగారం అని నెత్తిన పెట్టుకున్నవారే దరిద్రపు జన్మ అని ఛీకొట్టారు.అదృష్టదేవత అని ముద్దు చేసిన శ్రీవారు నష్ట జాతకురాలు అని ఈసడించుకున్నాడు.అత్తగారైతే సరేసరి. సూటిపోటి వాగ్బాణాల వడ్డింపులు తప్పనిసరి.
క్రమంగా శాంతికి మనశ్శాంతి కరువై. అశాంతికి నిలువెత్తు సాక్ష్యమైంది.తను ఎంత మానసిక క్షోభననుభవిస్తోందో తను వ్రాసిన చివరి ఉత్తరంలో వివరించింది.తీరిక లేని టూర్లతో నిత్యం సతమతమయ్యే నేను తనను కలిసి ధై

కాస్త ప్రేమ, మరికాస్త ఓదార్పు కరువైన బ్రతుకు బండిని లాగడం కష్టమనుకుందో ఏమిటో..చివరికి ఇలాంటి నిర్ణయం తీసేసుకుంది.
మా శాంతి చచ్చిపోయిందికాదు కాదు అందరూ కలిసి చంపేశారు.
0 comments:
Post a Comment