Thursday, March 10, 2011

మిలియన్ "సందేహాల" మార్చ్...!!

తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ఎందరో అమాయక ప్రజల కంటే ట్యాంక్‌బండ్‌పై ధ్వంసమైన విగ్రహాలు ఏమంత గొప్పవి కావని, అంత అవసరమైతే వాటిని మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని, ఇక మీడియాపై జరిగిన దాడిని 'ఖండిస్తున్నాము' అని సరిపుచ్చుకున్న కేటిఆర్ అండ్ కో.,లకు, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే తక్కిన రాజకీయులందరికీ -

పోలీసుల లాఠీ దెబ్బలకు ఎప్పుడూ ఆ అమాయకులే ఎందుకు గురవుతున్నారు..????
పోలీసుల తూటాలు వారినే ఎందుకు వరిస్తున్నాయి..????

ఆ అమాయకులనే రక్షణ వలయంగా ఉపయోగించుకుంటూ పబ్బం గడుపుకుంటున్నదెవరు..?

ఆంధ్ర కేసరి వలె తూటాలకు రొమ్ము ఎదురొడ్డి నిలువగలిగే దమ్ము, తెగువ, అంకితభావం గల వారు మీలో ఎందరున్నారు..?

మల్టీస్పెషాలిటీ హాస్పిటళ్లలో డాక్టర్ల పర్యవేక్షణలో కాకుండా.. అమరజీవి వలె అకుంఠిత దీక్షతో, నిజమైన 'ఆమరణ నిరాహారదీక్ష' చేసే వారు మీలో ఎందరున్నారు..?

రాజులు, రాజ్యాలు అంతరించిపోయినా, పెత్తందార్లకు, భూస్వాములకు కాలం చెల్లిపోయినా ఆ శైలి పోరాటాలు మాత్రం ఆగటం లేదేం మరి.. నాయకుల జిత్తులకు సామాన్య కార్యకర్తలు, ప్రజలేగా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ బలైపోతుండేది...

పైసల కోసమో, పదవుల కోసమో కార్యకర్తల జీవితాలను పణంగా పెట్టే నాయకుల కుటుంబాల్లో ఎవరికైనా, ఏ ఒక్కరికైనా వీసమెత్తు నష్టం జరిగిందా?? ఈ నాయకులు జరగనిస్తారా?

"దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయమన్నట్లు" ఎప్పటికప్పుడు ఈ స్వార్థ రాజకీయుల జిత్తులకు పోలోమంటూ గుడ్డిగా మద్దతిచ్చేసి, జైకొట్టే 'సామాన్య ప్రజానీకం' ఆ ఉసిగొల్పే నాయకుల 'అసలు రంగు'ని పట్టించుకునే ప్రయత్నమే చేయదెందుకో??

ఈ సదరు నాయకులు ఎన్నెన్నో పదవులు అనుభవిస్తూ, ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు ఈ తెలంగాణా వాదాన్ని వినిపించేందుకు నోరు పెగల్లేదెందుకో??

0 comments: